అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

22, జులై 2013, సోమవారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3

  ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3   (you are here)

 పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3 

                        మన వస్తాదు పని మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉంది.రాజు గారితో కూడా స్నేహం బాగా ముదరడంతో రాచకార్యల లోను మంచి ప్రధాన్యత లభించింది. ఓ రోజు మంతనాలాడుతు  అశ్వ శాలకు తీసుకొచ్చి రాజు ఇలా అన్నాడు. నూటికి వస్తాదు గారూ పక్క రాజ్యపు రాజు మన మీద కత్తికట్టాడు. యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు నేను వేగులను పంపి తెలుసు కున్న విషయమేమిటంటే అశ్వ గజ పదాతి దళాలు అన్నీ అతనితో సమానంగా ఉన్నాయి. కాక పోతే పదాతి దళంలో ఓ యాభై మంది తక్కువ కాని వంద మంది పెట్టు మీరున్నారుగా ........కావున మీకు కావలసిన గుర్రాన్ని మీరు ఎంపిక  చేసుకోండి. యుద్ధానికి తరలి వెళదాం. 

   ఇరకాటకంలో పడిన వస్తాదు చప్పున ఓ కుంటి గుర్రాన్ని ఎంచుకొని తాను నక్కచ్చు కదా ! అని భావించాడు. యుద్ధం అనే మాట వినగానే రాజు గారి పంచకళ్యాణి నేలను థాటించి కాలుదువ్వుతూ రాజుగారికేసి వస్తాదుకేసి ఉరిమి చూసింది. అది కుంటిగుర్రమనుకున్నాడు మన వస్తాదు. రాజా! ఈ గుర్రాన్నిప్పించండి. రాజు వస్తాదు సమయస్ఫూర్తికి అభినందిస్తూ సెహభాష్ ! నా గుర్రాన్నే ఎంచుకున్నారు. మన సైన్యాధ్యక్షుడితో పాటు ముందుండి వ్యూహరచన చేస్తూ సైన్యాన్ని నడిపించండి. నేను గజదళాన్ని నా అంబారీపై ఎక్కి వస్తూ నడిపిస్తాను. కానీ తమరు పదాతి దళంపై దృష్టిపెట్టి ఉండండి. రాజు మాటలకు ఏమనాలో తోచక మనకి విజయం తథ్యం అంటూ గుర్రాన్ని ఇంటికి తోలుకు పోయాడు.

                 భార్యతో "నేను భారీ విగ్రహాన్నైతే  పెంచానుగానీ కనీసం ఈ గుర్రాన్ని స్వారీ చేయగలనంటావా" అంటూ దానిపై ఎక్కి కళ్ళెం పట్టుకుని ఎందుకైనా మంచిది ఈ గుర్రం పైనుండి పడిపోకుండా దీని జీనుతో పెద్ద చాంతాళ్ళేసి గట్టిగా నా కాళ్ళు కట్టు అన్నాడు. అబ్బో మీ బుర్ర బాగా పెరిగిందండీ అంటూ అభినందించి కదనరంగానికి సాగనంపింది ఆ కాంతామణి. 

                    సుశిక్షితమైన గుర్రం అశ్వబలాలన్నీ వచ్చి చేరేదాకా మెల్లగా నడుస్తూ సైనికుల హాహాకారాలను అశ్వ హేషలను వింటున్నకొద్దీ తన వేగాన్ని పెంచింది. భయం కొద్దీ కళ్ళాన్ని బిగించి పట్టుకుంటున్నాడ వస్తాదు.  కళ్ళెం బిగించిన కొద్దీ గుర్రం దూసుకు పోతోంది. అశ్వసైన్యాలన్నీ ఆమడ దూరంలో గోచరిస్తూండగా దారీ తెన్నూ లేక అశ్వ హృదయాన్ని అర్థం చేసుకోలేక తాను జీనుకు కట్టుకున్న కట్లే ప్రతిబంధకాలుగా తయారవడంతో దారిలో ఎదురుగా కనబడ్డ ఓ రెండు పెద్ద తాటి చెట్లను కావలించుకున్నాడు వస్తాదు. గుర్రంకూడా కదలలేని స్థితిలో గింజుకుంటూంటే రెండు చంకల్లో తాటి చెట్లను సమూలంగా ఊడబెరికి మరీ గుర్రం తన పరుగు లంఘించింది. 

               శతృసైన్యం దగ్గర పడుతోంది. చంకల్లో తాటి చెట్లతో ఆఘమేఘాల మీద దూసుకొస్తున్నాడు వస్తాదు. ఎదిరి సైన్యాలలో ఓ కలకలం. ఎవడ్రా వీడు యుద్ధానికి కత్తట్టుకొస్తారు, కర్రట్టుకొస్తారు. వీడేంట్రా బాబు ఏకంగా తాట చెట్లతో వస్తున్నాడు. 

                       ఛస్తాం రోయ్! నూటికొస్తాదంటే వీడే కామోసు మొదటి వరస వందమందికీ మూడినట్టే అంటూ వెనక్కి పరుగు తీసారు. మిగతా వారూ అదే భయంతో వెనకడుగే వేసారు. సైన్యం మొత్తం ఇట్లా తిరోగమనంతో వెనిదీయడంతో వాళ్ళ రాజ్య సరిహద్దులనే వాళ్ళు దాటిపోయారు. ఏం జరిగిందో ?.... జరుగుతోందో గ్రహించని నూటికొస్తాదు గుర్ర నురగలు కక్కుతూ కుప్పకూలిపోవడంతో ఆ నాటి యుద్ధం పరిసమప్తమైంది. 

                        ఆ రాజ్యానికి  నూటికొస్తాదే రాజ్య ప్రతినిధి అయ్యాడు. 

                  ఇప్పుడు చెప్పండి మాస్టారూ! యెర్రని యేగానీకి కూడా ఠికానా లేనోడు అదృష్టవంతుడైతే చాలు అందలాలెక్కేస్తాడు. రహీమ్ మాటలతో సాలోచనలో పడి మరి అమాయకుడైతే అందరికీ కష్టాలు నష్టాలు తెచ్చిపెట్టడా ???? 

                          కోడినక్కపిల్ల కథనంతో మళ్లీ కలుస్తా..........

 

 

 

 

14, జులై 2013, ఆదివారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

  ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2  (you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3  

             పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

                        అంటూ నూటికొస్తాదుని తీసుకుని ఇల్లుచేరిందా ఇల్లాలు. ఉదయాన్నే ఇంటితలుపు తట్టాడు మంత్రి. ఆవలిస్తూ తలుపు తీసిన ఆవిడకి బారెడు పొద్దెక్కడం మంత్రి దర్శనం ఒక్కసారే ఎదురయ్యాయి. ఏమ్మా నిన్న రాజుగారు చెప్పక... చెప్పక... ఒక పని చెప్తే మీ ఆయన ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా పడుకోడం బాగుందా, కనీసం నేనొచ్చాననైనా లేవకుండా ఉంటే మీకు దివాణంలో నౌకరీ ఊడినట్టే గదమాయింపుగా అన్నాడు మంత్రి. అంతే స్వరంతో చూడండి మంత్రిగారూ మా ఆయన నూటికొస్తాదు, యిరవై మంది దొంగలో లెఖ్ఖా.... ఎప్పుడో చంపి పడేసారు. రాత్రి రెండు, మూడు గంటలప్పుడనుకుంటాను ఇంటికొచ్చి ఇలా నిద్రోతున్నారు. లేపమంటారా. వద్దులేమ్మా నేనే ఆ దొంగలు చచ్చి పడిఉన్న ప్రదేశానికి వెళ్ళి చూసొస్తాను. పడుకోనీ పాపం. రాత్రి అలసిపోయి ఉంటాడు. 

                           మంత్రి నయగారానికి లోలోనే నవ్వుకుంటూ, మంత్రిగారూ మాకిక్కడ దినుసులకేం కొదవలేదుగానీ కొద్దిగా ఖర్చులుంటున్నాయ్ మరి తమరర్థం చేసుకోవాలి. తటపటాయించకుండా కావ్చల్సింది అడిగేసింది వస్తాదు భార్య. దాంతో వెండి మొహరీలు నెలకో వంద చొప్పున వారి కుటుంబానికి అందేవి. దాంతో ఇంట్లో నౌకర్లను కూడా పెట్టుకుని సౌఖ్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి వీలైంది. మన వస్తాదు వర్యుడు కూడా ఒళ్ళంతా నూని పట్టించుకుంటూ అభ్యంగన స్నానాలు చేస్తూ రోజూ కోడి, గొర్రె లాంటివి మేస్తూ చూడగానే వస్తాదు అనిపించేలా తయారయ్యాడు. 

                             అన్నిరోజులూ ఒక్కలా ఉండవు గదా! మరలా వస్తాదుకు పని పడింది.  రాజే స్వయంగా పిలిపించి చెప్పాడు. ఊరిచివర యాతలు ఓ ఎలుగుబంటితో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కల్లుకుండలన్నీ అది చిందర వందర చేసేస్తోంది. రాత్రుళ్ళు మరీ దాని ఆగడాలకు అంతులేకుండా ఉందట. మన సైనికులని పది మందిని పంపా కానీ ఏం ప్రయోజనం ఎలుగుబంటి చేతిలో కొందరు చచ్చి కొందరు బతికి వచ్చారు. ఎలాగైనా నువ్వే వెళ్లాలి. నువ్వు వందమంది పెట్టు కదా అదే నా ధైర్యం వెళ్ళి దాన్ని చంపిరా.

                     రాజు ఆదేశానికి విచారంగా నెత్తిన గుడ్డేసుకుని భార్యతో ఇలా అన్నాడు వస్తాదు. ఒసే ఇంకీ దివాణంలో మనకి నూకల్లేవే. మనుషులు కూడా కాదు జంతువుని నేను చంపాలంట. పద ఈ రాత్రికే పారిపోదాం. అమావాస్య, ఆదివారం అని నిర్ఘ్యాలు పెట్టకు. ఉన్నపళంగా కట్టుబట్టలతో పదండి. పెరటిదారిన తాటితోపుల మధ్యగుండా ఒకరిచేయి ఒకరు పట్టుకుని పారిపోదాం. 

                   వాళ్ళు వెళుతున్నారు...... అసలే రాత్రి అందునా అమాస, వస్తాదు ఒకవేపు చేతినే కాకుండా రెండో చేతిని కూడా ఎవరో పట్టుకుని గుంజుతున్నట్ల నిపించి భార్య చేయి వదిలేసి ఎలుగుబంటిని కాగలించుకున్నాడు వస్తాదు. ఏవండోయ్! అది ఎలుగుబంటిలాగుంది పరుగెత్తండంటూ పిల్లలను కాచుకుంటూ ఓ పొదలో దాగింది అతని భార్య. చురకత్తిపై చేయివేసి ఎలుగుబంటిని విడిపించుకుని  పక్కనున్న చెట్టుకు ఎగబాకాడు వస్తాదు. చెట్లెక్కడం ఎలుగుకుమాత్రం రాదా ఏమిటి? .....

                   కానీ అది విచిత్రంగా ఎక్కుతుంది. తలక్రిందులుగా... వస్తాదును సమీపిస్తున్న కొద్దీ.... చెట్టుపైకి పాకడంలో అతని చురకత్తి కాస్తాజారి ఎలుగు ముడ్డిలో దిగబడిపోయింది. నిశ్శబ్ధంగా దబ్బుమనే శబ్ధం తప్ప అతడికేమీ కనిపించలేదు. కిక్కుకిక్కు మని ఘుర్జరిస్తూ  చచ్చింది ఎలుగు. ఓ అర్ధగంట సద్దుమణిగాక మొదటగా తేరుకున్న అతని భార్య ఎలుగు రక్తపు మడుగులో పడి మరణించిందని ధృఢపరుచుకుని భర్తకై కేకలేసింది. నేనిక్కడే చెట్టుమీదే ఉన్నానే.... పర్లేదు దిగండి... అది చంపేస్తుందే... అదే చచ్చి పడింది... మీరు నన్ను చంపక  చెప్పింది చేయండి. ముందా చెట్టు దిగండి. 

                    కొందరికి అదృష్టం ఆతుల్లో పట్టడమంటే ఇదేనేమో ..... భార్యా భర్తలు మరలా దివాణం కేసి అడుగులేసారు. మర్నాడు మంత్రి పిలవడం - రాజసభకు వెళ్ళి వస్తాదు రాత్రి తలగడ పాఠాన్ని తూ.చ తప్పకుండా అప్పగించడం జరిగింది. ఎలుగును చూసిన రాజు పొంగిపోతూ, మన నూటికొస్తాదు ఎంత సూటిగాడోయ్ అమావాస్య రాత్రిలో కూడా కత్తి విసిరాడంటే ఏమనాలి .... ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. ఓ సన్మాన సభ ఏర్పాటుచేసి పులిగోరు పతకంలా... ఎలుగ్గోరు పతకం చేయించి మెళ్ళోవేసి, ఇతనికీ నెలనుంచి వెండి మొహరీలే కాదు బంగారు మొహరీలు కూడా ఇవ్వండని ఆదేశించి ఆ నాటి సభ ముగించాడు. 

                                             .................................సశేషం    

10, జులై 2013, బుధవారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి  వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు(you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3                               

                 పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు
                         అదృష్టవంతుడు అంబులెన్స్ క్రింద పడతాడన్నది నేటి సామెత. ఎర్రని యేగానికి కూడా చెల్లుబాటు కాని వాడు అందలాలెక్కాడంటే అది అదృష్టమనే అనుకోవాలి. "నెత్తిమీద రూపాయిపెట్టి పావలాకమ్మినా చెల్లవురా " అని పెద్దలు తిట్టడం నాకు బాగా గుర్తుంది. ఈ రోజుల్లో యేగాని గూర్చిగాని కానీ, దమ్మిడీ, డబ్బు, పైసా లాంటి పదాలు నేటి తరానికి అందుబాటులో లేనివి. చెల్లుబాటుండాలి కానీ విషయమేదైనా..... ? విన ఆశక్తిగానే ఉంటుంది. 
                        కన్నూరుపాలెం అనే కుగ్రామంలో నాకు కో టెనెంట్ గా" పీర్ బీ-- రెహమాన్ " అనే సాయిబు దంపతులు ఉండేవారు. వెన్నెల వాకిట్లో పడుకుని "శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తులన్" అనే నన్నయగారి పద్యం బిగ్గరగా పాడుకుంటున్నాను. రెహమాన్ పంతులుగారూ నేనో కథ చెబుతాను అన్నాడు. అక్షరం ముక్క కూడా రాని అతగాడి కుతూహలాన్ని గమనించి సరే నీభాషలో చెప్పు  అంటూ శ్రోతగా విన్నాను ఈ నూటికొస్తాదు కథ.
                        కథాకమామీషు ఏంటంటే ................................
                        ఓ మారాజుగారుండే రాజ్యంలో...... నాబోటి అమామీకుడొకడు తన భార్యా పిల్లలతో కలిసి ఓ సత్రంలో బసచేయడానికొచ్చాడు. ఆడొట్టి బద్ధకస్తుడు. ఏ సంపాదనాలేని పేదోడు. రోజువారీ సంపాదన సేతకాని ఆడితో ఆయమ్మ ( వాడి భార్య లెండి ) ఏదో ఏగుతోంది. సత్రంకూడు, మఠం నిద్రచేస్తూ రోజులు గడిపేత్తన్నారు. 
                            ఆదేశపు మారాజుగారికి మంత్రిగారితో కలిసి పుర ఈదుల్లో మారేశాలేసుకుని తిరుగుతూ.... పెజలేటనుకుంటున్నారో  తెల్సుకోడం ఓ యిదిగా ఉండేది. మన అమామీకుడున్నాడు కదండీ ( వాడికేం పేరుపెట్టలేదు ) ఆడికి దారిలో యేగాని దొరికినాది. దాంతో సుట్టముక్క కొనుక్కుంటానని ఆడంటే, ఆడి పెల్లం ఒల్లకో ఆ డబ్బియ్యి ఈ రోజు రేతిరికి పిల్లగాల్లకి తింటాని కేటీనేదు. అంటూ లాక్కుంది. ఓసె.... యేగానికేటొత్తాదే అనేలోపు మావా! సెట్టికొట్టుకెల్లి ఏదోటి అట్టుకొత్తానుగానీ సిటం ఆగవో అంటూ లగెత్తింది.  
                               అంత రాత్రిపూట ఓ ఆడది వీధులోకి వెళ్తుంటే ఏం జరుగుతోందో తెల్సుకోడనికి ఆ సత్రం ముందటే మాటేసి రాజూ మంత్రి గమనించసాగారు. ఆవిడ కోమటి కొట్టుకెళ్ళి పాకిపోయిన బెల్లం చవగ్గా వస్తోందని సెట్టినడిగి కొనుక్కొచ్చింది. అసలే ఆషాఢమాసం సత్రంలో ఈగలెక్కువ వాటిని తోలుకుంటూ ఈ బెల్లంతో ఏం చేద్దునా అని ఆలోచిస్తూ.....  తన భర్తకి ఈగల్ని తోలే పని అప్పగించి బిందట్టుకుని నీళ్ళకోసం వెళ్ళిందావిడ. 
                             పనిలేని మంగలి పిల్లి బుర్ర గొరిగేడన్నట్లు మనవాడు బెల్లంమీద వాలుతున్న ప్రతీ ఈగనీ ఠాప్.. ఠప్.. మని కొట్టి చంపి పడేస్తున్నాడు. దానికితోడు లెక్కపెడుతూ 1, 9,16 ,36, 52, 78, 93 అంటూ 99 ఈగను కూడా చంపి పడేసాడు. భార్య వచ్చిన అలికిడి విని బిగ్గరగా ఆగు అలాగ..... ఇప్పటికి 99 పేణాలు తీసాను నూటికొస్తాను అంటూ వందో ఈగనుకూడా ఠాప్ మనిపించేడు. చూసిన ఆవిడ అవాక్కై నించుని మావా! అయితే నూటికి వస్తాదువైపోయావు అంటూ బుగ్గలు నొక్కుకుని మెటికలిరిసింది. 
                                 వీరి మాటలు వింటున్న రాజు మంత్రితో ఇలా అన్నాడు. మన దివాణంలో వస్తాదులున్నారు గానీ..... వీడెవడో నూటికి వస్తాదునంటున్నాడు కాబట్టి అతనిని మన దివాణానికి తరలించే ఏర్పాటు చేయండి అని చెప్పి అంతః పురానికి పోయాడు . మంత్రి పల్లకీ పంపించి నూటికొస్తాదు దంపతులను దివాణానికి ఆహ్వానించాడు. ఆ రాజెవడో - ఈ మంత్రెందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా అర్ధాకలితో నకనకలాడే వారి కడుపులు దివాణంలో అడుగు పెట్టడానికి సంశయించలేదు. మన నూటికొస్తాదు భార్య కాస్త గడసరిది...  లౌక్యం గలది. తన భర్తని వంద ప్రాణాలు తీసేసిన మొనగాడిగా, మొగాడిగా రాజూ, మంత్రి గుర్తించారని గ్రహించి పూర్తి విషయాన్ని తన భర్తకి కూడా ఉపదేశం చేసి మెల్లిగా కోట్లో పాగా వేసింది. 
                                    రోజులు, నెలలూ గడుస్తున్నాయి. దివాణంలో నివసిస్తున్న నూటికొస్తాదు దంపతులకు రోజులు బాగానే గడుస్తున్నాయి. ఏ రోజూ తిండికి వెతుక్కోనక్కర లేకపోయింది. కానీ అన్ని రోజులూ ఒకలా ఉంటాయా?  మంత్రి నూటికొస్తాదును పిలిపించాడు. రావోయ్..  వంద పేణాలు తీసిన మొనగాడా, ఈ రోజు నీకు పనిబడింది. మన రాజ్యం ఊరి చివర్లో ఓ 20 మంది దొంగలు దోచుకుంటున్నారు. రాజుగారు నిన్ను పంపమన్నారు. వారిని చంపమని. నీకదేమంత పని అనుకో చిటికెలో వందమందిని చంపగలవు. ఇదే రాజుగారు చెప్పిన మొదటి పని చేయలేదనుకో చాలా ప్రమాదం. జాగ్రత్త, అంటూ హుకుం జారీ చేసాడు. 
                                  ఇంటికొస్తూనే తుండుగుడ్డ నెత్తిమీద వేసుకుని - "మన పనైపోనాదే ఒకడుగాదు ఇద్దరుగాదు ఇరవై మంది దొంగలంట. నేనే చంపాలంట.మనకి నూకలు సెల్లిపోనాయి పద ఈ రేతిరికే ఎక్కడికేనా పారిపోదాం" అన్నాడు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలయదిరిగి రాత్రికి పారిపోవాలంటే ఏదో ఓటి చేయాలి. పిల్లలకి దారిలో ఆకలైతేనో అనుకుంటూ కొద్దిగా బెల్లం నూలుపప్పు రోట్లో వేసి చీకట్లో దంచనారంభించింది. అప్పటికే రోట్లో ఓ నాగుపాము తల దాచుకుంది. చూడకుండా గబగబా దంచేస్తూ ఉండలు కట్టి నూటికొస్తాదుతో బయలుదేరింది ఆ అనుంగు సతీమణి. అదేం చిత్రమోగానీ ఆ ఉండలుకూడా ఇరవైయ్యే అయినాయి. 
                                   రాజ్యం వదిలి పారిపోతున్న వీరికి దారిలో ఎదురయ్యారు ఆ ఇరవై మంది దొంగలూ. ఓయ్.. మీ దగ్గర ఏమున్నాయో  ఇలా ఇవ్వండి అంటూ బెదిరించారు దొంగలు. డబ్బూ దస్కం మా దగ్గరేం లేవయ్యా .... అనగానే మరా మూటేమిటి అంటూ ప్రశ్నించాడు దొంగల నాయకుడు. పిల్లలకి బెల్లపుండలు బాబూ.. అంటూ ఉండగా ఎక్కడ లాక్కుంటారో అని అతని భార్య కొంగుచాటున దాచుకుంది. దొంగల ఖర్మగాలి దాచుకున్న ఇరవై ఉండలూ బాగున్నాయంటూ తలకోటీ చప్పరించారు. గప్....చుప్.... మనకుండా నురగలు కక్కుకుంటూ ఇరవై మందీ కుప్పకూలిపోయారు. వాళ్ళనలా చూసి విస్తుపోయారు నూటికొస్తాదు దంపతులు. వేగంగా తేరుకున్న అతని భార్య ఉండల్లో విషం ఉందని  విషయం గ్రహించి భర్తతో ఏవండీ నయం మనం తిన్నాం గాదు. ఊరుదాటక ముందే చచ్చేవాళ్ళం. వీళ్ళచావు మన మంచికొచ్చింది. వీళ్ళని చంపమని గదా రాజుగారి ఆదేశం. అనుకున్నది అనుకోకుండా జరిగింది. ఇంక పారిపోనక్కరలేదు. పదండి దివాణానికి ................................
                                                                                                        సశే షం.