అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, జూన్ 2013, శనివారం

పదనిసలు-4 వర్జ్యసంహారం

                                     వర్జ్యసంహారం      

  ప్రస్తుత కథాంశాన్ని చాలా రోజులుగా అందరితో పంచు కోవాలనుకుంటున్నాను. ఈ కథ కు  ఇతివృత్తం వర్జ్యం.  అనగా విడువదగిన సమయము అని అర్థం. మా తాతలలో ఒకరైన కీ|| శే||  పంతుల భాస్కరరావు గారు "వర్జ్య సంహార " కావ్యంగా ఛందోబంధాలలో చిత్రీకరించారు. కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అనే సామెత మీరందరు ఎరిగినదే. కథా వస్తువు ఏదైనా హాస్యస్ఫోరకంగా రచించడంలో ఆయన దిట్టకవే.  


                       ఇక వర్జ్య సంహార కావ్యకథా వస్తువును కథగా చెప్పే ముందు ఓ రెండు మాటలు చెప్పాలి. నేనా కావ్యాన్ని చూడనూలేదు, చదవనూలేదు. ఇంట్లోవాళ్ళు ముచ్చటించుకునే సందర్భంలో కవిగారి చమత్కారం, హాస్య ఫక్కీ  నన్నెంతగానో ఆకర్షించేవి. వర్జ్యం, దుర్ముహూర్తం అనేవి మనం నేటికీ పంచాంగాలలో గమనిస్తూంటాం. అసలు పంచాంగం అంటేనే తిథి,వార,నక్షత్ర,యోగ,కరణాలు కదా. సమయ పాలనా సందర్భాన్ని పురస్కరించుకుని వారమునకు దుర్ముహూర్త కాలము, వర్జనీయ సమయములు సూచింపబడుతుంటాయి.ఈ నేపథ్యం నుండి వర్జ్య సంహార కథాసుధ ప్రావుద్భవించింది. 

                 అనగనగా ఓ రాజ్యాన్ని అయోమయం రాజు పాలించేవాడు. అతనిమంత్రి మరీ బుద్ధిహీనుడు, అయినా రాచకార్యాలు ఇతర ఉద్యోగులవల్ల సజావుగానే సాగుతూనే ఉండేవి . ఆ రాజ సభలో ఓ నిలయ విద్వాంసునిగా జోస్యుడొకడు పంచాంగం పఠించేవాడు. అందరితో పాటుగా "రాజు - మంత్రి" కూడా శ్రద్ధగా వినేవారు. పంచాంగంలోని వర్జ్యాన్ని గూర్చి రాజూ, మంత్రి తమ బుద్ధి సూక్ష్మతతో పరిశీలించారు. వార దుర్ముహూర్తం పద్ధతిగా రోజుకు బాగానే వస్తూంది. రాజన్నాడు కదా "ఓయి మంత్రి ఆ వర్జ్యం పద్ధతిగా లేదోయ్ మన పంతులుగార్ని ఓ సారి అడిగి దాన్ని సంస్కరించాలి." మంత్రి అంటాడు కదా "రాజా రామరాజ్యంలాంటి మీ ఏలుబడిలో అన్నీ సజావుగానే ఉండాలి. పద్ధతి తప్పి ప్రవర్తించే తీరు దేనికీ ఉండకూడదు. అనంత కాల విశ్వంలో పంతులుగారు చెప్పినట్లు నక్షత్రాలన్నీ మేకరాశి నుండి చేపరాశి దాకా పద్ధతిగా ఉంటాయి. గ్రహాలూ పద్ధతిగానే తిరుగుతుంటాయి. ఈ వర్జ్యం మాత్రమే అడ్డదిడ్డంగా దానికి నచ్చినప్పుడు వస్తూ పోతూ ఉంటుంది."

" మంత్రీ ! అదేనయ్యా నా బాధ ,  ఓ రోజులో చేసుకోవాలనుకున్న పనులకి ఇది మహా ఆటంకంగా ఉంది. పంతులుగారొచ్చి చెప్పేదాకా ఆ వర్జ్యం ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలీదు. వార దుర్ముహూర్తంలా దానికి పద్ధతిలేదు. ఏం చేస్తే బాగుంటుందంటావ్", 
మంత్రి తటపటాయించకుండా టక్కున సమాధానం చెప్పాడు.

             " హే రాజన్ !   సజావుగా లేని వారికి మరణదండనే శిక్ష, కావున మీరు వెంటనే ఆ వర్జ్యాన్ని సంహరించాలి. పంతులుగార్ని వెంటనే ఆదేశిస్తాను వర్జ్యాన్ని పట్టుకురమ్మని."

 రాజు మనసు కుదుట పడింది." సరే ఈ రాత్రికే దాన్ని సంహరించేస్తాను. వెంటనే పంతులు గార్ని పట్టుకు రమ్మనండి." అంటూ అంతః పురంలోకి పోయాడు. 
                బుద్ధిహీనుడైన ఆ మంత్రి రెండో మాట మాట్లాడకుండా వర్జ్యాన్ని తెస్తావా ? చస్తావా ? అంటూ పంతులు గారికి పురమాయించాడు.

 పాపం ఆ బాపడు ఏం చేయాలో తోచక తన భార్యతో సంప్రదించాడు. సాయింత్రానికల్లా వర్జ్యాన్ని తేకపోతే దాన్ని సంహరించడం మాట ఏమోగాని ఈ సమస్య నా చావుకొచ్చింది. విచారిస్తున్న అతన్ని చూసి భార్య అన్నది కదా!

" ఏమండీ, వర్జ్యన్ని ఎవరు తేగలరు, అదేమైనా కందిపప్పు పొట్లమా కట్టుకు పట్టుకు పోడానికి, ఈ తలతిక్క వ్యవహారానికి కొద్ది మోసం జోడించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా, నాకో ఆలోచన తట్టింది". అంటూ ఉపాయాన్ని సూచించింది.

 ఎలకల బోనులో  పడ్ద ఓ ఎలకకి జేగురు రాసి, పిండి చుక్కలు పెట్టి, బాగా ముస్తాబు చేసి భర్తకిచ్చింది. 

                 మన పండితులవారు రాజ సభకు తీసుకెళ్ళి తన బుద్ధికి పదునుబెట్టి ఇట్లా చెప్పాడు.

 "ఆర్యా ! మీరడిగారు గనక నా తపోశక్తిని ధారబోసి ఈ సారికి వర్జ్యాన్ని తెచ్చాను. మీకు తెలుసు కదా, దీనికి కుదురులేదు, దానికి నచ్చినట్లది ఎగురుతూ దుముకుతూ పరిగెడుతుంది. ఈ వర్జ్యాన్ని సంహరించడం ఇక మీ భాద్యత. మరలా తెమ్మంటే నా వల్ల కాదు." సంహరించండంటూ గుడ్డమూట విప్పాడు. 

ఇంకేముంది రాజ సభలో పెద్ద కలకలం. పట్టుకోండి ..  పట్టుకోండి ..  అంటూ అరుపులు రాజుగారి ఆఙ్ఞ , మంత్రిగారి ఆరాటం , సైనికులంతా వర్జ్యాన్ని వెతకనారంభించారు." రాజు నేనే సంహరిస్తాను , మీరుదాన్ని చంపకండి. అని ఆదేశించాడు. "
                          మూడు రోజులు నిద్రాహారాలు మాని దాన్ని వెంబడిస్తూ వీధులు, పట్టణాలు, పల్లెలూ గాలిస్తూ చివరికది ఓ కొండ బొరియలో దూరినట్లు గుర్తించారు. అక్కడ కొందరు కాపలాకాస్తూ రాజుకా వర్తమానాన్ని అందించారు. వర్జ్య సంహారానికి సిద్ధపడిన రాజు రాజ్యపాలన విధులన్నీ - మంత్రికి అప్పగించి ఆ కొండ బండలను బద్దలుగొట్టించే పనిలో పడ్దాడు. 
                             ఇది ఇలా ఉండగా రాణి వాసంలో  రాణీ గారిని తేలుకుట్టింది. తెలుసుకున్న మంత్రి వైద్యులకు కబురుపంపాడు. సమయానికి వారందుబాటులో లేకపోవడంతో వైద్యనాథుల శిష్యులు విషం తలకెక్కకుండా చూసుకోండి, మా గురువుగార్ని త్వరగా తీసుకొస్తాం అని వార్తాహరులను సమాధాన పరిచి, గురువుగారి దగ్గరకు వెళ్ళారు. 
                  రాణిగారు తేలువిషం సలపడంతో గోలగోల చేస్తూ ఉంటే మంత్రి తన బుర్రకు పదును బెట్టి వైద్యనాధ శిష్యులు చెప్పిన ప్రకారం తలనుండి మొండెం వేరుచేసి విషం తలకెక్కకుండా జాగ్రత్త పడేటట్లు ఆదేశించాడు. వైద్యనాథులు ముహూర్త సమయంలోనే అంతఃపురానికి వచ్చినా మంత్రిచేసిన అఘాయిత్యం గ్రహించి, 

"అబ్బే లాభం లేదండి చూడండి ముఖం వాడిపోయింది విషం తలకెక్కేసింది." అని చెప్పి తప్పించుకున్నారు. 

                 మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. రాణిగారికి సంతానం లేదు, రాజుగారా.. వర్జ్యసంహారంలో ఉన్నారు. అంతఃపుర కాంతలను వేలేసి తాకరాదుకదా.. గంధం చెక్కలు తెప్పించి రాణివాసాన్నే తగలెట్టేసాడు. ఆ మంటలు అంతటితో ఆగకుండా ఊరంతా చుట్టుముట్టేసాయి. వెంటనే స్పందించిన మంత్రి చెరువుగట్టు కోట్టేయించి మంటలార్పబోయాడు. కానీ ఏం లాభం, మీదలు కాలి - క్రిందలు నీటికి నాని,  రాజ్యం మొత్తం భూకంపం వచ్చినట్లు చెల్లాచెదురైపోయింది. 

                         అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నగరాన్నంతా పునర్నిర్మించాడు మంత్రి. అయోమయం రాజు కూడా కొండని త్రవ్వి ఎలుకను పట్టి వర్జ్యసంహారం చేసానంటూ వీర విహారం చేస్తూ రాజ్యానికొచ్చాడు. ఎదురు సన్నాహాలతో మంత్రి తోడ్కొని తెచ్చాడు. 
 రాజ్యాన్నంతా క్రొత్తగా చూస్తున్నట్లుందని, రాజు వ్యాఖ్యానించడంతో 

"అయ్యా!  ఏం జరిగిందనుకున్నారు  అంటూ
   రాణిగారికి తేలుకుట్టడం దగ్గరనించి, రాజ్య నిర్మాణం దాకా అన్ని విషయాలు పూసగ్రుచ్చినట్లు చెప్పాడు మంత్రి. సెహభాష్ ! అంటూ మెచ్చుకున్నాడు రాజు.

కానీ రాజుగారికి కలిగిన సందేహం మంత్రిగారి సమాధానం విడవకుండా మీరు వినాలి, అప్పుడే  నిజమైన వర్జ్యానికి సార్ధకత చేకూరేది.

                       ఇంతకీ  రాజు అడిగిన సందేహం .... 
" సరేనయ్యా మంత్రీ!  కానీ చెరువులోని చేపలేమయ్యాయి?  

దానికి మంత్రి  సమాధానం ....
 " మహా ప్రభో చేపలన్నీ చెట్లెక్కి పోయాయి"
                             -:  ఇదండీ వర్జ్య సంహారం కథ. :-

 మరోసారి మరో కథనంతో నూటికి- వస్తాదును పరిచయం చేస్తా.....            

1 కామెంట్‌: